ఖరీఫ్ పంటకు 84.6TMCల నీటి కేటాయింపు-మంత్రి కాకాణి

క్రాప్ సీజన్ కొంత ముందుకు-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల కింద ఆయకట్టుకు సంబందించి 2022-23 సంవత్సరం మొదటి పంటకు సాగునీరు అందించేందుకు ఆదివారం జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో 8.46 లక్షల ఎకరాలకు సంబందించి 84.6TMCల నీటిని కేటాయిస్తూ కమిటి తీర్మానించడం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని సాగు, త్రాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని ప్రణాళికాబద్దంగా ఖరీఫ్ పంట సాగుకు సంబందించి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా అన్నీ చర్యలు తీసుకోవడంతో పాటు వారి సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని జిల్లాలో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.క్షేత్రస్థాయిలో పండించిన పంటకు మద్దతు ధర లేక క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, సాగునీటి పారుదల కాలువలకు చేపట్టాల్సిన మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు త్వరగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడటం వలన సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు సమృద్దిగా ఉన్నాయని, జిల్లాలో 2022-23 ఖరీఫ్ పంటకు సాగునీటిని కేటాయించేందుకు సోమశిల జలాశయం కింద మొత్తం 5.51 లక్షల ఎకరాల ఆయకట్టుకు 55.1 టి.ఎం.సి.లు, అలాగే కండలేరు జలాశయం కింద నెల్లూరు, తిరుపతి జిల్లాలో గల 2.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు 29.5 టి.ఎం.సిల సాగు నీటిని కేటాయించేలా ఈ సమావేశంలో ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఖరీఫ్ సీజన్ కు సంబందించి క్రాప్ సీజన్ కొంత ముందుకు తీసుకు రావడం జరిగిందని, గ్రామ స్థాయిలో నీటి సంఘాల సభ్యులను, నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసి కేటాయించిన సాగునీటిని ప్రతి చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో వున్న ఇరిగేషన్ కెనాల్స్ ఆధునీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.