ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో 48 గంటల ముందు నుంచి బల్క్ SMSలు నిషేధం-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ జరిగే రోజు ముగింపు సమయం సాయంత్రం 4 గంటలకు ముందు 48 గంటల పాటు అనగా మార్చి 11వ తేది సాయంత్రం 4 గంటల నుండి 13వ తేది సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ స్వభావంతో కూడిన సందేశాలతో ప్రచారం చేయడం గాని లేదా అభ్యంతరకరమైన బల్క్ SMS ( షార్ట్ మేసేజ్ సర్వీసెస్) లను పంపడాన్ని నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కెవిఎన్ చక్రధర్ బాబు తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా పంపే బల్క్ SMSలపై ఏదైనా ఉల్లంఘన జరిగితే ఎన్నికల నేరంగా తీవ్రంగా పరిగణించబడుతుందని,, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం ఎన్నికల చట్టాల సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయన్నారు. చెల్లింపు బల్క్ SMS సేవలు వినియోగదారులకు అందించే సమయంలో రాష్ట్రంలోని అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు భారత ఎన్నికల సంఘం ఆదేశాలను, సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు..రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లు పంపే బల్క్ SMSలు పంపే విషయమై భారతదేశ ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనలు ఖచ్చితంగా అమలు జరిగేలా ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, ఎంసిసి బృందాలు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.