సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు

హైదరాబాద్: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(DSP) పై సైబర్ క్రైమ్ విభాగానికి సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘ఓ పరి’ అనే ఆల్బమ్ లో ‘హరే రామ..హరే కృష్ణ’ మంత్రాన్ని ఐటెం సాంగ్ గా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తులు ధరించి నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని,లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి హెచ్చరించారు. రాక్ స్టార్ గా పేరున్న దేవీ శ్రీ ఇటీవలే నాన్ ఫిల్మ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియోను బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ లాంఛ్ చేశారు.‘ఓ పరి’ టైటిల్ తో సాంగ్ సాగుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ స్వయంగా కంపోజ్ చేయడమే కాకుండా ఆయనే పాడారు. అయితే పాట మధ్యలో హరే రామ..హరే కృష్ణ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.