చికెన్ పకోడా దుకాణాలపై హెల్త్ ఆఫీసర్ దాడులు

నెల్లూరు: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలతో నగరంలోని వివిధ చికెన్ పకోడా షాపులపై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి దుకాణదారులకు శుక్రవారం జరిమానాలు విధించారు. స్థానిక పాత జడ్పీ ఆఫీస్,సుబేదారు పేట రోడ్డులోని చికెన్ పకోడా దుకాణాల్లో నిబంధనలు పాటించకుండా, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దుకాణదారుల వద్ద నుంచి దాదాపు 30 కేజీల వరకు చికెన్ పకోడాను అధికారులు స్వాధీనం చేసుకొని, పదివేల రూపాయల జరిమానాన్ని విధించారు.ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అమరేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని పలు దుకాణాలపై దాడులు చేసి, సంబంధిత చికెన్ పకోడాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాటిని నిర్వీర్యం చేసి, మొదటి హెచ్చరిక కింద జరిమానాన్ని విధించడం జరిగిందని తెలిపారు.మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం అయితే షాపులను సీజ్ చేయడమే కాకుండా యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.అదేవిధంగా కచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్లను కలిగి ఉండాలని 100% పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వెంకటేశ్వరరావు, నీరజ, ప్రశాంతి ఫ్లోరా, శానిటరీ సూపర్వైజర్ కృష్ణారెడ్డి, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.