హైదరాబాద్: ముఖ్యమంత్రి KCR తాంత్రికుడి సూచనతోనే సచివాలయానికి వెళ్లడం లేదని, ఫాంహౌజ్ లో నిత్యం నల్ల పిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసిఆర్, తాంత్రికుడి సలహా మేరకే TRS పార్టీ పేరును BRS గా మార్చారని పేర్కొన్నారు. ఈ విషయం తనకు ఓ స్వామిజీ తెలిపారని, కేసీఆర్ చేస్తున్న పనులు, గత చరిత్రను విశ్లేషించిన తరువాతే వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయం వెల్లడిస్తున్నానన్నారు. స్వామిజీలు, వేద పండితులతోపాటు సమాజ హితం కోరే వాళ్లంతా కేసీఆర్ క్షుద్ర పూజల నుంచి తెలంగాణను కాపాడాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఫాంహౌజ్ లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేశాడని,, ఆ పూజల అనంతరం వాటిని కాళేశ్వరంకు వెళ్లి, అక్కడ కలిపాడని,, పైకి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళుతున్నానని చెప్పాడని మండిపడ్డారు. ప్రతి 3 నెలలకోసారి నల్ల పిల్లితో పూజలు చేస్తాడని, గతంలో ఫాంహౌజ్ లో ఒక యువకుడు అనుమానాస్పదంగా చనిపోతే, దీనిపై నోరు ఎందుకు మెదపలేదని నిలదీశారు. ఈడీ దాడులపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ,, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అవినీతి, అక్రమాలు చేసి కోట్లు సంపాదిస్తూ,,అవినీతి, హత్యలు, మాన భంగాలు చేస్తుంటే ఈడీ, సీబీఐ చూస్తూ ఊరుకుంటదా? లిక్కర్ స్కాంలో, చీకోటి పేకాట స్కాంలో, డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నరు? 2014 ఎన్నికల్లో సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు సంపాదించినవన్నో దమ్ముంటే బయటపెట్టండంటూ సవాల్ చేశారు.