ఆదర్శ హరిత నగరంగా తీర్చిదిద్దుదాం-మేయర్,కమీషనర్

నెల్లూరు: నగర వ్యాప్తంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణతో ఆదర్శ నెల్లూరు హరిత నగరాన్ని తీర్చిదిద్దుదామని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి,కమీషనర్ హరిత పేర్కొన్నారు.హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రూరల్ నియోజకవర్గం బుజ బుజ నెల్లూరు వల్లూరమ్మ కాలనీ ప్రాంతంలో మొక్కలను నాటి సంరక్షణా బాధ్యతలను స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న హరిత నగరాలు’కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా విజయవంతం చేయాలని సూచించారు. పర్యావరణ హితానికై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ ఆచరించేలా చైతన్యం కలిగించాలని కమీషనర్ హరిత కోరారు.నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,అధికారులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.