శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తేది నుంచి ప్రారంభం-ఆర్డీవో
నెల్లూరు: మార్చి నెల 2వ తేదీ నుంచి జరగనున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని RDO మలోల అధికారులకు సూచించారు.శనివారం నగరంలోని రంగనాయకులపేటలో వెలసివున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై RDO వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నగరంలో పినాకిని నదీ తీరాన వెలసి ఉన్న ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా కీర్తించబడే క్షేత్రాదీశులు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి నెల 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు. ఉత్సవాలను వేద, దివ్య, ప్రబంధ గోష్టి యుక్తంగా విద్యుత్ దీపాలంకరణతో, విశేష పుష్పాలంకరణతో భాగవతజన నయనానందకరంగా లోక కళ్యాణార్థమై అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
సేవలు-పూజలు:- ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి నెల 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరుగుతుందని,,3వ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి శేష వాహనం, 4వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి హంస వాహనం, 5వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 6వ తేదీన ఉదయం పల్లకి, రాత్రి హనుమంత సేవ,7వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి బంగారు గరుడసేవ జరుగుతాయన్నారు. అలాగే 8వ తేది సాయంత్రం పూలంగి సేవ, కళ్యాణోత్సవం, గజ వాహన సేవ, 9వ తేదీన రథోత్సవము, 10వ తేదీన అశ్వ వాహనము, 11వ తేదీన పుణ్యకోటి విమానము, 12వ తేదీన పుష్పయాగము, 13వ తేదీ రాత్రి తెప్పోత్సవము నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లా నుండే కాక వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విరివిగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.పెన్నానది స్నాన ఘట్టం వద్ద గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలన్నారు.భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని ఆర్డిఓ కోరారు..ఈ సమావేశంలో అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు పాల్గొన్నారు.