జిల్లాలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనేదే లక్ష్యం-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే బృహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నామని జిల్లాకలెక్టర్ KVN చక్రధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం బుచ్చిరెడ్దిపాలెం మండలంలోని కట్టుబడివారిపాలెం జగనన్న కాలనీల్లో నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు ప్రతి శనివారం హోసింగ్ డే గా నిర్ణయించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. సచివాలయ స్థాయిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి జిల్లా స్థాయి అధికారి, ప్రత్యేక అధికారుల వరకు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులందరూ పాల్గొని పనులు వేగవంతం చేయుటకు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ ఎటువంటి పెండింగు లేకుండా చూస్తున్నామన్నారు. అదేవిధంగా గృహ నిర్మాణానికి వడ్డీలేని రుణాన్ని అందిస్తున్నామన్నారు. పేద ST కుటుంబాలకు CSR నిధుల నుంచి అదనపు నగదు కూడా మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సౌకర్యాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకొని ఇళ్లు పూర్తి చేసుకోవాలన్నారు. కొత్తగా నుడా పరిధిలోకి వచ్చిన వారికి కూడా ఇళ్ళు మంజూరు చేశామని, ఇప్పటివరకు జిల్లాలో 63 వేల మందికి ఇళ్లు మంజూరు చేసామన్నారు. ఇంకా ఎవరైనా ఇంటి కొరకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా కాలనీలలో అంతర్గత మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాబోవు ఉగాది నాటికి గృహప్రవేశం చేయడానికి లబ్ధిదారులకు సహకారం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుధాకర్, బుచ్చి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో నరసింహారావు, తహసీల్దార్ పద్మజ తదితరులు ఉన్నారు.