డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకు యూజీసీ నిర్ణయం-డా.కె.లక్ష్మణ్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉందన్నారు.అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కి, యూజీసీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలో సుమారు 423 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, వాటితో పాటు మరో 130 డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా,ఒక్కో యూనివర్సిటీ ప్రతి ఏడాది సగటును 3,000 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తే, మొత్తం 16 లక్షల మందికి అడ్మీషన్ పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులు విద్యావకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. అందులో భాగంగానే డీమ్డ్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని యుజిసి నిర్ణయం తీసుకొవడం అభినందనీయమన్నారు.UGC ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుండే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసేలా అన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు.