భద్రాచలంలోవైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం
అమరావతి: పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాల ప్రతిధ్వనుల మధ్య భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది..గురువారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు..భక్తుల కోలాహలం,, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు..అభిజిత్ ముహూర్తాన అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు..మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేశారు.. జనకమహారాజు, దశరథమహారాజు తరఫున చేయించిన రెండు మంగళసూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక మంగళసూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ కావించారు..మంగళధారణ సమయంలో శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ భక్తులు ఉచ్ఛస్తుంటే మిథిలా ప్రాంగణమంతా రామనామమయమైంది.