వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోండి-కలెక్టర్
నెల్లూరు: ప్రతి రోజు జిజిహెచ్ కు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్, వైద్యధికారులను ఆదేశించారు.బుధవారం నగరంలోని జిజిహెచ్ ను కలెక్టర్ ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత ప్రసూతి,,చిన్న పిల్లల భవనాన్ని సందర్శించి చిన్న పిల్లల వార్డును తనిఖీ చేసి వైద్య చికిత్స నిమిత్తం అడ్మిట్ అయిన పిల్లల ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యసదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్, ఆసుపత్రి సూపరింటిండెంట్, వైద్యులతో సమావేశమై జిజిహెచ్ లో అందిస్తున్న వైద్య సేవలను, వైద్య పరికరాలు, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్ పరిస్థితి, వైద్యులు, వైద్య సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్స్ ను వినియోగంలోని తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని, అలాగే చెడిపోయిన, పనికిరాని వైద్య పరికరాలను ప్రొసీజర్ ప్రకారం వేలం వేయుటకు చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సూపరింటిండెంట్ ను ఆదేశించారు. వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలుకు చర్యలు తీసుకోవడంతో పాటు వైద్య పరీక్షలన్నీ ఒకే భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. చికిత్స కోసం జిజిహెచ్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవలను అందించడంలో అలసత్వం వహించిన వైద్యులు, వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జి జి హెచ్ సూపరింటిండెంట్ డా.బి. సిద్దానాయక్, ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వెంకట ప్రసాద్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డా.జయచంద్రారెడ్డి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.