ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు
నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అనుమతి వుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం సాయంత్రం కమాండ్ కంట్రోలు సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్కు 48 గంటల ముందు భారత ఎన్నికల సంఘం పేర్కొన్న అన్ని నిబంధనలను రాజకీయపార్టీల అభ్యర్థులు తప్పకుండా పాటించాలన్నారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రచారానికి అనుమతి వుంటుందని, ఆ తరువాత ఎటువంటి మైకులు, జనం లేకుండా కేవలం నలుగురితో మాత్రమే ఇంటింటికి వెళ్లి సైలెంట్గా ప్రచారం చేసుకోవాలన్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు జిల్లాను విడిచివెళ్లాలని, అన్ని కల్యాణ మండపాలు, లాడ్జిల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడ్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎటువంటి ప్రకటనలు ఇవ్వకూడదని, పత్రికల్లో మాత్రం ముందస్తుగా అనుమతి పొంది ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. పోలింగ్ రోజున కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతి వుంటుందన్నారు. ఒక్కొక్క వాహనంలో ఐదుగురు మాత్రమే ప్రయాణించాలన్నారు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఒక బూత్ను రాజకీయపార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని, ఆ బూత్లో కేవలం ఒక టేబుల్, రెండు చైర్లు, ఒక బ్యానరు మాత్రమే ఉండాలన్నారు. కేవలం ఇద్దరు మాత్రమే అక్కడ వుండాలన్నారు. పోలింగ్ ఏజెంటు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటరు జాబితాను తీసుకుని ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావడానికి వీలులేదన్నారు. జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపుగా పూర్తయ్యిందన్నారు. ఈనెల 7వ తేదీ నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 19542 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఇంకా 566మంది వినియోగించుకోవాల్సి ఉందన్నారు. గురువారం కూడా అన్ని ఆర్వో కార్యాలయల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు పనిచేస్తాయని, ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయని వారు వినియోగించుకోవాలన్నారు. అలాగే బుధవారం నుంచి రెండోవిడత 85 సంవత్సరములు పైబడిన వృద్ధులు, వికలాంగుల అనుమతి మేరకు వారి ఇంటి వద్దకే వెళ్లి అధికారులు ఓటు సేకరించే కార్యక్రమం కూడా ప్రారంభమైందని కలెక్టరు చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని అత్యంత పారదర్శకంగా చేపడుతున్నామని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో రాజకీయపార్టీల ప్రతినిధులు భాగస్వామ్యం కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో డిఆర్వో లవన్న, టీడీపీ ప్రతినిథులు రసూల్, హరికృష్ణ, వైసీపీ నుంచి విజయ్, కాంగ్రెస్ నుంచి బాల సుధాకర్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.