పారదర్శకంగా సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ-కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ ఆదేశాలతో చేపట్టిన కార్యదర్శుల బదిలీల ప్రక్రియను నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ వికాస్ మర్మత్ ప్రకటించారు. కార్యాలయంలో గురువారం నిర్వహించిన సచివాలయాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియను కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని నెల్లూరు నగర పాలక సంస్థ, పురసంఘాలు, నగర పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయాల కార్యదర్శుల ఆన్లైన్ అభ్యర్ధనల మేరకు బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు నిర్దేశించిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ ను తప్పనిసరిగా ఫాలో కావాలని సూచించారు. 2019/2020 వార్డు సచివాలయాల సెక్రెటరీల నియామకం, ర్యాంకు, మార్కుల ప్రాధాన్యత మేరకు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, ఇతర పురపాలక సంఘాల కమిషనర్ లు, నగర పంచాయతీలను సమన్వయం చేసుకుని వార్డు సచివాలయాల కార్యదర్శుల బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కమిషనర్ కోరారు. బదిలీల ప్రక్రియలో కావలి, గూడూరు, నాయుడు పేట, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట కమిషనర్ లు, సిబ్బంది పాల్గొన్నారు.