విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి- నైతిక విలువలతోనే ఉన్నతస్థానాలు-గవర్నర్
‘న్యాక్ ` ఎ గేడ్’ పొందడం VSUకి గర్వకారణం..
నెల్లూరు: విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ సమాజహితం కోసం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి అబ్దుల్ నజీర్ అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రక్షణ మంత్రిత్వశాఖ సైంటిఫిక్ అడ్వయిజర్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి.సతీష్రెడ్డి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఈఎన్టి శస్త్ర చికిత్స నిపుణులు డా.ఇ.సి. వినయ్కుమార్కు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ నుంచి గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
అనంతరం గాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లులకు డిగ్రీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ను గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం నెరవేరేందుకు సంకల్పం, పట్టుదల కలిగి ఉండాలన్నారు. పెద్ద కలలు కనడానికి సంకోచకూడదని, బయట ప్రపంచంలో మీ కోసం ఎదురుచూసే అపరిమితమైన అవకాశాలు, అపరిమిత సామర్థ్యాలను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయాణం సాగించాలన్నారు. మీరు సాధించిన డిగ్రీలు మీ వ్యక్తిగత యోగ్యతకు నిదర్శనమని, సమాజానికి సేవ చేయడానికి ఒక సోపానమన్నారు. కరుణ, సమగ్రత, గౌరవాన్ని నొక్కి చెప్పే సాంప్రదాయ విలువలను విద్యార్థులందరూ స్వీకరించాలని, మీరు ఈ విలువలకు కట్టుబడి ఉండటం మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవప్రదంగా ఉంటుందన్నారు. న్యాక్ `ఎ గేడ్’ పొందడం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి గర్వకారణం అన్నారు. తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్ను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జిఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ డాక్టర్ రామచంద్రారెడ్డి ఘనంగా సత్కరించారు.