AMARAVATHIDISTRICTS

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు..

నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తయి జిల్లాలో ఎన్నికల బరిలో 129మంది నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ వెల్లడించారు..బుధవారం కలెక్టరేట్‌లోని మీడియా కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌తో కలిసి కలెక్టర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయి ఎన్నికల బరిలో వున్న అభ్యర్థుల జాబితాను ప్రచురించినట్లు చెప్పారు. నెల్లూరుపార్లమెంటుకు 14 మంది, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 22 మంది, కావలిలో 13, ఆత్మకూరు 13, కోవూరు 13, నెల్లూరు సిటీ 15, నెల్లూరు రూరల్‌ 13, సర్వేపల్లి 13, ఉదయగిరి అసెంబ్లీనియోజకవర్గాల్లో 15 మంది మొత్తం 115మంది ఎన్నికల బరిలో నిలిచినట్లు కలెక్టర్‌ వెల్లడిరచారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేనెల 13న పోలింగ్‌ తేదీ అని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోగా పోలింగ్‌ నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలైన్లలో ఉన్న ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పిస్తామని కలెక్టర్‌ చెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకునేందుకు ప్రభుత్వం మే 13న లేబర్‌ హాలిడేగా ప్రకటించినట్లు చెప్పారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 126సెక్షన్‌ ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారాలకు అనుమతి వుంటుందని అభ్యర్థులకు సూచించారు.పోలింగ్‌కు 48 గంటల ముందు అన్ని హోటళ్లు, లాడ్జీలను తనిఖీలు చేపడ్తామమని,  జిల్లా బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ జిల్లాను విడిచి వెళ్లాలని, ఈ మేరకు రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు. మద్యం విక్రయించరాదని, బార్లు, రిటైల్‌ దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఎపిక్‌ కార్డుతో పాటు ఆధార్‌, ఉపాధిహామీ జాబ్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌, పింఛన్‌ ధ్రువపత్రం, సర్వీసు ఐడెండిటి కార్డు మొదలైన 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈమేరకు ప్రతిఒక్కరూ ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు.

ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు:- ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సర్వీసు ఓటర్లందరూ వారి నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లోనే పోస్టల్‌బ్యాలెటు ఓట్లు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటివరకు 19వేల ఫామ్‌`12 దరఖాస్తులు అందించామని, మరో రెండురోజుల్లో 3వేల ఫామ్‌`12లు అందించనున్నట్లు చెప్పారు. సుమారు 20వేల మంది పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించుకునేలా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సర్వీసు ఓటర్లకు ఏ నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉంటే ఆ నియోజకవర్గ కేంద్రంలోనే ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మే నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంటుకు, అసెంబ్లీకు రెండు ఓట్లు వేసేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు.   229 మంది అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న వారు మాత్రం వారికి కేటాయించిన రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో మే నెల 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 5 గంటలవరకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలన్నారు.  85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1712మందికి ఫామ్‌`12డి అందించామని, వీరు మే నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఒకసారి, 8 నుంచి 10వ తేదీ వరకు రెండువిడతల్లో ఇంటివద్దనే పార్లమెంటు, అసెంబ్లీకి రెండు ఓట్లు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. సీజ్‌చేసిన నగదును జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ  ఆధ్వర్యంలో తగిన ఆధారాలతో పరిశీలించి రూ.10లక్షల లోపు అయితే తిరిగి అందిస్తున్నామని, రూ.10లక్షలకు పైబడితే ఇన్‌కంటాక్స్‌ అధికారులు విచారణలో ధ్రువీకరణ అయితే  అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలోని ప్రశాంతవాతావరణంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తున్నామని, అభ్యర్థులందరూ కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *