మొండి బకాయిలపై చట్టపరమైన చర్యలు తప్పనిసరి–కమిషనర్ వికాస్
సెలవు రోజుల్లో కేంద్రాలు ఓపెన్..
నెల్లూరు: నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన మొండి బకాయీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వికాస్ మర్మత్, హెచ్చరించారు. స్థానిక ఏ.బి.ఎమ్ కంపౌండ్ నిర్వాహకులను కమిషనర్ శనివారం కలుసుకుని బకాయిలపై ప్రత్యక్షంగా వివరణ కోరారు. 1999 -2000 ఆర్ధిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు అసలు వడ్డీలు కలిపి ఏ.బి.ఎమ్ సంస్థ 67 లక్షల రూపాయల బకాయి ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ సదుపాయం ఉన్న కారణంగా దాదాపు 47 లక్షల రూపాయలు మినహాయింపు ఉందని, చెల్లించవలసిన 20 లక్షల రూపాయలను ఏకమొత్తంలో మంగళవారం లోపు చెల్లించాలని కమిషనర్ సంస్థ కస్టోడియన్ మహిమాంబ కు సూచించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.సెలవు దినాల్లో సైతం పన్నుల చెల్లింపు కేంద్రాలను నడుపుతున్నామని, నగర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వయంగా ఆన్లైన్ విధానంలో కూడా చెల్లింపుదారులు పన్నులను చెల్లించి అపరాధ రుసుము పడకుండా జాగ్రత్తలు వహించాలని కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మద, రెవెన్యూ అధికారి శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అజయ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.