నామినేషన్లకు అన్ని పత్రాలు సమర్పించండి- ఆర్.ఓ వికాస్ మర్మత్
నెల్లూరు: ఈనెల 18 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని పత్రాలను సమర్పించాలని నెల్లూరు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్., రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఓ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని వివరించారు.ఎన్నికల జమా ఖర్చుల అకౌంటింగ్ ను ప్రతి ఒక్క అభ్యర్థి పారదర్శకంగా రికార్డు చేసుకుని సమర్పించాలని సూచించారు. అనంతరం ప్రతినిధులు అడిగిన వివిధ సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.