వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఇమడలేరు-ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి
నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ తేదేపా కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ప్రజా జీవితంలో ఇమడలేరని రాజ్యసభ సభ్యులు, ycp నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు..సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో, ఆమె పోన్ ద్వారా మాట్లాడిన మాటలు మీడియా ముందు బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే తాము స్థబ్దంగా ఉండిపోతామని ప్రశాంతి చెప్పడం వారి ఉద్దేశాన్ని బయటపెట్టిందని అన్నారు. వారు ఓడిపోతే ఇండియాతో పాటు ఇతర దేశాల్లో వారి వ్యాపారాలు చేసుకుంటారే తప్ప ప్రజలను పట్టించుకోరని ఆమె మాటలు ద్వారా స్పష్టమవుతోందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీలోని ప్రతినాయకుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజల కష్టాలు తమవిగా భావించి సహకారం అందిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎటువంటి వారు తమకు నాయకులుగా కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.
ధన ఆహంకారంతో ప్రశాంతి:- అంతకు ముందు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ పెద్దవారి పట్ల అగౌరవంగా మాట్లాడటం సరికాదని, ధన ఆహంకారం వారితో ఆ విధంగా మాట్లాడించిందని అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతి తనకు ఫోన్ చేసి తన సహకారం కోరిందని, పలువుర్ని కించపరుస్తూ మాట్లాడిందని అన్నారు. తనకు తన అన్న ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఎటువంటి విభేదాలు లేవని అన్నారు.