ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సజావుగా నిర్వహించండి-డి.ఆర్.ఓ
నెల్లూరు: జిల్లాలో ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకటనారాయణమ్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 20వ తేది నుంచి మార్చి 7వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ విద్యార్థులకు, ఈనెల 26వ తేది నుంచి మార్చి 7వ తేదీ వరకు ఎంపీసీ, బైపిసి విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 23,150 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్ ఐ ఓ వరప్రసాద్, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.