యాచకులకు సంక్షేమ పథకాలు అందించే అవకాశాలను పరిశీలించండి- కమిషనర్ వికాస్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నగరంలోని యాచకులకు అందించి వారి సంక్షేమానికి కృషి చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా 45వ డివిజను పొగతోట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ బుధవారం ఉదయం 6.30 గంటలకు పర్యవేక్షించారు.స్థానిక సాయిబాబా మందిరం ప్రాంగణంలో యాచిస్తున్న వారిని గమనించిన కమిషనర్ వారితో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి అందించాల్సిన పెన్షన్, ఉచిత గృహాలు వంటి సదుపాయాల కోసం అవసరమైన ఆధార్, ఓటర్, రేషన్ కార్డు వంటి పత్రాలను మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అనంతరం డివిజను పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. విద్యుత్ శాఖ వారు తొలగిస్తున్న భారీ చెట్ల కొమ్మలను స్థానిక ప్రదేశాల్లోనే వదిలేస్తున్నారని, ఆ శాఖ వారితో మాట్లాడి పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి, సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.