జి జి హెచ్ ను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తాం:-కలెక్టర్
అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తాం-ఎంపీ
నెల్లూరు: వైద్యులు, సిబ్బంది అంకితభావంతో వైద్యసేవలందించి జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మంచిపేరు తీసుకురావాలని నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు.మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జిజిహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత మూడు నెలలుగా తమ దృష్టికి, కలెక్టర్ దృష్టికి వచ్చిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ పేర్కొన్నారు.
జి జి హెచ్ ను పూర్తిస్థాయిలో:- కలెక్టర్ ఎం హరినారాయణన్ మాట్లాడుతూ, రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు, అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండేలా జిల్లా ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానంగా రోగులు ప్రైవేటు వైద్యశాలపై ఆధారపడకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యశాలలోనే మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్యాజువాలిటీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని, ట్రామా, ఎమర్జెన్సీ కేర్ విభాగాల పనితీరు మెరుగుపడేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.