జగనన్న సురక్ష పథకంతో అర్హులందరికీ సంక్షేమం- కమిషనర్ వికాస్
నెల్లూరు: ప్రజా సమస్యలకు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “జగనన్న సురక్ష” పథకంతో అర్హులందరికీ సంక్షేమం సాధ్యమని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. స్థానిక రూరల్ నియోజకవర్గం పరిధిలోని 2, 26 డివిజనులోని 7 సచివాలయాల కేంద్రాలు, నగర నియోజకవర్గం పరిధిలోని 15, 39, 40 డివిజనుల్లోని మొత్తం 8 సచివాలయాల్లో మంగళవారం ప్రారంభించిన జగనన్న సురక్ష పథకంలో భాగంగా కమిషనర్ పాల్గొని మంజూరు చేసిన టోకన్ల ఆధారంగా లబ్ధిదారులకు ధ్రువపత్రాలు మంజూరు చేశారు. అదేవిధంగా జగనన్న సురక్ష శిబిరాలు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో ఆధార్ అప్డేట్ సెంటర్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలను అందించామని తెలిపారు. సచివాలయ సిబిరాలలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్, హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్ డెస్క్ ల ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా మొత్తం 11 సేవలను అందిస్తున్నామన్నారు.ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), ఆదాయ,జనన మరణ, ఆస్థి పన్ను పేరు మార్పు చేర్పులు, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్ డేట్, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు,చేర్పు లాంటి సేవలను అందించామని కమిషనర్ వివరించారు.ఈ కార్యక్రమాల్లో విజయా డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్థానిక డివిజనుల కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.