భూహక్కు రీ సర్వే పనులు వేగవంతం చేయండి-కమిషనర్ శ్రీమతి హరిత
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాశ్వత భూ హక్కు- భూ రక్ష పధకం నిర్వహణలో భాగంగా నగర వ్యాప్తంగా రీ సర్వే పనులను వేగవంతం చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. శాశ్వత భూహక్కు, భూ రక్ష పధకం నిర్వహణపై కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ అడ్మిన్, ప్లానింగ్, రెవెన్యూ సెక్రెటరీలను సమన్వయపరచి రీ సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెస్మెంట్ నెంబర్లను అడ్మిన్ సెక్రెటరీలతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించి వారి లాగిన్ ల ద్వారా సిడిఎంఏ పోర్టల్ లో అప్లోడ్ చేయించాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన సమాచారం అందించడంలో వార్డు ప్లానింగ్ సెక్రెటరీలు, వార్డు రెవెన్యూ సెక్రటరీలు అడ్మిన్ కార్యదర్శులకు సహకరించేలా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పనులను పూర్తి చేసి సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ లో పొందుపరచాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
పన్ను వసూళ్ళు:- నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య నిర్వహణ పనుల యూజర్ చార్జీల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు వారాంతపు లక్ష్యాలను నిర్దేశించాలని, లక్ష్యాలు పూర్తి చేయనివారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. రెవెన్యూ అధికారులంతా కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, తహసీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ లు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.