న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కొన్నిసమయాల్లో మౌనంగా ఉండడం ముఖ్యం- జస్టిస్ శేషసాయి
నెల్లూరు: న్యాయవాద వృత్తిలో రాణించాలంటే బాగా వాదించగలగడంతో పాటు కొన్ని సమయాల్లో సందర్భానుసారంగా మౌనంగా ఉండడం అనేది చాలా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ వి శేష సాయి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో నూతన న్యాయస్థాన భవనాలను హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ తో కలసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ తక్కువ వ్యవధిలోనే భవన నిర్మాణాలను పూర్తిచేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలన్నారు. ముఖ్యంగా జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ తదితరులు ఎంతో కృషి చేశారని ప్రశంశించారు. పనిచేసే ప్రదేశం బాగుంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. న్యాయమూర్తుల నుండి మంచి మంచి తీర్పులు వస్తున్నాయంటే ఆయా న్యాయవాదులు మంచిగా వాదిస్తున్నారని అర్థమన్నారు. బార్ అసోసియేషన్ బాగుంటేనే బెంచ్ కూడా బాగుoటుందన్నారు. సీనియర్ న్యాయవాదులు ఎక్కడైతే గౌరవింపబడతారో ఆయా బార్ అసోసియేషన్లు బాగుంటాయన్నారు. మెరికల్లాంటి న్యాయవాదులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి డాక్టర్ యామిని, జిల్లా ఎస్ పి తిరుమలేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాద గుమస్తా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.