జాతీయ పోటీలకు వెళ్తున్న విద్యార్థులను అభినందించిన కమిషనర్ వికాస్
నెల్లూరు: 37వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన 16 మంది విద్యార్థులను నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అభినందించారు. నగర పాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో విద్యార్థులను కమిషనర్ మంగళవారం కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 1 వ తేదీ నుంచి స్థానిక ఏ. సి.సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో విద్యార్థులంతా శిక్షణ పొందారని, గోవాలో నవంబర్ 6 నుండి 8 వ తేదీ వరకు జరిగే 37 వ జాతీయ స్కై మార్షల్ పోటీలకు రాష్ట్రం నుండి 16 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్ పోటీలలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి క్రీడల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులను కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సంధ్య రాణి, శమిత, వెంకట లక్ష్మీ, చాందిని, సత్య శ్రీ దేవి, కామేశ్వరి, కుసుమ శ్రీ, అబిదా సుల్తానా, ప్రవీణ్, జీలన్ బాషా, నీలాంజిని ప్రసాద్, మహమ్మద్ ఆఫన్, గోపి రాము, జయంత్, మహమ్మద్ ముషాహిద్, శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ స్కై మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ ఇస్మాయిల్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఇబ్రహీం పాల్గొన్నారు.