ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కు 8వ తేదీ వరకు ఓటింగ్కు అవకాశం- కలెక్టర్
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పిలుపునిచ్చారు. ఆదివారం కావలిలోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ సరళిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ విధులకు హాజరయ్యే ప్రతిఒక్క ఉద్యోగి తమకు కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లో విధిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఈనెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం ఉందని, ఇంకా ఎవరైనా ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపీ ఉండి ఫారం-12 ఇవ్వకుండా వుండి, ఇప్పుడు ఇస్తున్నారని, వారికి కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉద్యోగులందరూ ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.