వేడుకగా “నా భూమి – నా దేశం” కార్యక్రమం
నెల్లూరు: ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ” నా భూమి-నా దేశం”, ” నేల తల్లికి నమస్కారం-వీరులకు వందనం” కార్యక్రమాలను శనివారం వేడుకగా నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23 వ డివిజన్ పడారుపల్లి మారుతీ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు ఎం.పి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ లు హాజరయ్యారు. పడారుపల్లి పార్కులో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారత దేశ రక్షణ వ్యవస్థలో సైనికులుగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ఎంపీ ఘనంగా సన్మానించారు. పార్కు ఆవరణంలో నా భూమి-నా దేశం కార్యక్రమంలో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.