కులగణన ప్రక్రియను ప్రణాళికాబధ్ధంగా పూర్తి చేయండి-కమిషనర్ వికాస్
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియను నగర పాలక సంస్థ పరిధిలో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సచివాలయాల కార్యదర్శులను కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. బుధవారం కస్తూర్భా కళాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. సమాచార సేకరణను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో, సమాచారం ఇతరులు తెలుసుకోలేనట్టి పటిష్టమైన విధానాల్లో చేపట్టనున్నామని తెలిపారు. కులగణన సర్వేలో ప్రజలు తెలిపిన కుల సమాచారాన్ని ఎలాంటి ఆధార పత్రాల ధ్రువీకరణ లేకుండానే నమోదు చేసుకోవాలని కమిషనర్ కార్యదర్శులకు సూచించారు. కొన్ని కులాలకు మన రాష్ట్రంలో గుర్తింపు లేనందున అలాంటి వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. సమాజంలోని అన్ని వర్గాలను సర్వేలో మమేకం చేసి సమగ్రమైన సర్వే వివరాలను సేకరించాలని కమిషనర్ సూచించారు. డిసెంబరు 3వ తేదీ వరకు అన్ని వర్గాల ప్రజలనుంచి కులగణన వివరాలను సేకరించి సమగ్రమైన సమాచారాన్ని అందించాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టి.పి.ఆర్.ఓ ప్రసాద్, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.