నగరపాలక సంస్థలో అసెస్మెంట్ నెంబర్ల బకాయిలు ఎందుకు వసూళ్లు కావడంలేదు-కమీషనర్
నెల్లూరు: నగరంలో దీర్ఘకాలికంగా కొన్ని అసెస్మెంట్ నెంబర్ల బకాయిలు ఎందుకు వసూళ్లు కావడంలేదని, భారీ బకాయిలు (డిమాండ్ల) కు సంభందించిన కారణాలను వివరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ అధికారులను ప్రశ్నించారు..ఇందుకు సమాధానంగా డబల్ ఎంట్రీ, నాట్ ట్రేసబుల్ అసెస్మెంట్ లతో పాటు, ఎంక్రోచ్మెంట్ లో తొలగించిన అసెస్మెంట్ నెంబర్లపై భారీ బకాయిలు ఉన్నాయని, అందువల్ల నిర్దేశించిన లక్ష్యాల వసూళ్లను ఆశించిన స్థాయిలో చేయలేకున్నామని అధికారులు బదులిచ్చారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో రెవెన్యూశాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని ఇంటి పన్ను,కొళాయి, డ్రైనేజీ పన్నుల వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీర్ఘకాల పన్నుల బకాయిలు ఉన్న డబల్ ఎంట్రీ, నాట్ ట్రేసబుల్ అసెస్మెంట్ నెంబర్లను క్షేత్రస్థాయిలో వాస్తవాలను పునర్విచారణ జరిపి డబుల్ ఎంట్రీ , నాట్ ట్రేస్ అసెస్మెంట్ లను తొలగించేందుకు ప్రతిపాదనలను తయారు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో తొలగించిన ఇండ్లు, షాపులు అసెస్మెంట్ నెంబర్లతో పాటు డిమాండ్ ను తొలగించేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం కోసం ప్రతిపాదించాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సంజనా సింహా, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.