ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి రూ.లక్ష ఆర్దిక సాయం-పవన్

అమరావతి: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్దికంగా అండగా నిలిచారు. ఇప్పటం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించిన పవన్,వారి కష్టలను చూసి చలించిపోయి,వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలియజేశారు.‘మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్న వారు, నివాసాలు కోల్పోయిన వారికి రూ.లక్ష వంతున అందించి అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మార్చి14వ తేదిన ఇప్పటం శివారులో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టిన వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కూల్చిందని పేర్కొన్నారు. పోలీసులను, జె.సి.బి.లను పెట్టి మరీ ఇళ్లు కూల్చివేయడం దారుణమని, ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు.ఈ సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు’ అని తెలిపారు.