రేపు “నా భూమి – నా దేశం” కార్యక్రమం- కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు: భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ,యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖల ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా “అమృత కలశ యాత్ర”ను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం తెలిపారు. కలెక్టర్ హరినారాయణన్ సూచనలతో నగర పాలక సంస్థ పరిధిలో శుక్రవారం వార్డుల స్థాయిలో డోలు, నగారా వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలతో ఇంటింటికి తిరిగి మట్టిని, అమృత కలశములో వరి బియ్యాన్ని సేకరించనున్నామని వెల్లడించారు. సచివాలయ వార్డు అడ్మిన్ కార్యదర్శుల నేతృత్వంలో ప్రజలతో పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేయించనున్నామని కమిషనర్ తెలిపారు.
సేకరించిన అమృత కలశాలను, మట్టిని అక్టోబర్ నెల 13వ తేదీ లోగా నగర పాలక సంస్థలో సమీకరించుకుని, పండుగ వాతావరణం సృష్టించేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా అమరవీరులను సత్కరించటం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, NSS,,NCC, అంగన్వాడీ కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.