భూహక్కు రీ సర్వే పనులు వేగవంతం చేయండి-కమిషనర్ శ్రీమతి హరిత
నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాశ్వత భూ హక్కు- భూ రక్ష పధకం నిర్వహణలో భాగంగా నగర వ్యాప్తంగా రీ సర్వే పనులను వేగవంతం చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. శాశ్వత భూహక్కు, భూ రక్ష పధకం నిర్వహణపై కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం, వార్డు సచివాలయ అడ్మిన్, ప్లానింగ్, రెవెన్యూ సెక్రటరీలతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ అడ్మిన్, ప్లానింగ్, రెవెన్యూ సెక్రెటరీలు సమన్వయంగా విధులు నిర్వహించి రీ సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెస్మెంట్ నెంబర్లను అడ్మిన్ సెక్రెటరీలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తమ లాగిన్ ల ద్వారా సిడిఎంఏ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన సమాచారం అందించడంలో వార్డు ప్లానింగ్ సెక్రెటరీలు, వార్డు రెవెన్యూ సెక్రటరీలు అడ్మిన్ కార్యదర్శులకు సహకరించాలని కమిషనర్ సూచించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పనులను పూర్తి చేసి సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ లో పొందుపరచాలని సెక్రెటరీలను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.