విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది-మంత్రి సురేష్
నెల్లూరు: విద్యకు పేదరికం అడ్డుకాకూడదని, విద్య ద్వారా వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చుని భావించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు..గురువారం నెల్లూరు నగరంలోని నవాబుపేట బివిఎస్ బాలికల మున్సిపల్ హైస్కూల్లో రూ.2.09 కోట్లతో నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోర్టు, కాంపౌండ్ వాల్ ను ఎమ్మేల్యే అనిల్ కుమార్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. జవాబుదారీ, అవినీతి రహిత, పారదర్శక పాలనకు నిదర్శనం తమ ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బివిఎస్ పాఠశాలలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం, బాస్కెట్బాల్ కోర్టును 2.09 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఆర్ ఎస్ ఆర్ హైస్కూల్లో కూడా ఫుట్బాల్ కోర్ట్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్, పలు డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.