అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారికి పుష్పయాగం
కడప: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహోత్సవాల సందర్బంగా చివరి రోజున స్వామివారికి పుష్పయాగం సందర్భంగా ఆదివారం ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటలకు ముగియనుంది.ఇందులో తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, మొగలి తదితర 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు 2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు.. ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహిస్తారు..అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.