నగర వ్యాప్తంగా వున్న ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకుని రండీ-కమిషనర్ వికాస్ మర్మత్
పన్నుల బకాయిల వసూళ్లను..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను, కమర్షియల్ భవనాల పన్నులు, మంచినీటి పన్నులు, డ్రైనేజీ పన్నుల వసూళ్ళు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, లక్ష్యాలను సాధించాలని కమిషనర్ వికాస్ మర్మత్, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు.నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ అడ్మిన్ లతో బుధవారం సమీక్ష సమావేశాన్ని కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలలో తక్కువ శాతం వసూళ్లు చేసిన కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అమెనిటీస్ కార్యదర్శులు మంచినీటి పన్నులను వసూళ్ల లక్ష్యాలను అందుకోవాలని, అపార్టుమెంట్లు, సినిమా హాళ్లు తదితర వాణిజ్య భవనాలకు సంభందించిన పన్నుల వసూళ్ళ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు కోసం త్వరలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసూళ్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రతీ భవనాన్ని పన్ను పరిధిలోకి తీసుకొచ్చి, డిమాండ్ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. పన్ను వసూళ్ళలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు రోజూవారి లక్ష్యాలను నిర్దేశించి కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు అధికారులంతా కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ ఎస్.ఈ సంపత్ కుమార్, రెవెన్యూ, ఇంజనీరింగు అధికారులు పాల్గొన్నారు.