కాలువల్లో వ్యర్ధాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించండి- కమిషనర్ వికాస్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాలు, గుర్రపు డెక్కాకును యుద్ధప్రాతిపదికన తొలగించి నీటి పారుదలకు అంతరాయం లేకుండా చూడాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం పరమేశ్వరి నగర్, పాత మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యాచరణను ఆయన పరిశీలించారు. స్థానికంగా ఉన్న ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువల్లో పేరుకున్న వ్యర్ధాలను గమనించిన కమిషనర్ గ్యాంగ్ వర్క్ ద్వారా కాలువల పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పెన్నానది తీరంలో నూతనంగా నిర్మిస్తున్న హిందువుల కర్మక్రతువుల భవన పనులను కమిషనర్ పరిశీలించారు. సంప్రదాయ రీతిలో, అత్యంత నాణ్యతతో భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ చంద్రయ్య, శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.