“ప్రధాన మంత్రి స్వనిధి” పథకంతో చిరు వ్యాపారులకు చేయూత- కమిషనర్ వికాస్ మర్మత్
నెల్లూరు: వీధి వ్యాపారులు, చిరు వర్తకుల కుటుంబాలకు ఆర్ధిక సంక్షేమం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి.ఎమ్ స్వనిధి పధకం ఎంతగానో చేయూతను అందిస్తుందని కమిషనర్ వికాస్ మర్మత్ అన్నారు..మెప్మా విభాగం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల ఆర్ధిక ప్రగతికోసం రూపొందించిన ఈ పధకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, బకాయి మొత్తాలను సకాలంలో తిరిగి చెల్లించి మరింత మొత్తంలో రుణాలు పొందేందుకు అర్హతలు సాధించాలని సూచించారు. 10 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల మొత్తం రుణాన్ని మూడు సంవత్సరాల కాలంలో చెల్లించేలా పధకంలో వెసులుబాటు కల్పించారని కమిషనర్ వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని వీధి వర్తకులు, చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వర్తకులు తమ వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడి మొత్తాలను అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారస్తుల వద్ద తీసుకుని, చెల్లింపుల సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై ప్రజలకు అవగాహన పెంచాలని కమిషనర్ సూచించారు.అనంతరం రుణాల చెల్లింపులో నిబద్ధత పాటించి, అధిక రుణాల మంజూరుకు అర్హత సాధించిన లబ్ధిదారులకు, మొత్తాలు మంజూరు చేయడంలో ప్రతిభ కనబర్చిన మెప్మా సిబ్బందిని కమిషనర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పి.డి రవీంద్ర, ఎల్.డి.ఎమ్ ప్రదీప్ కుమార్, సి.ఎమ్.ఎమ్ పెంచలయ్య, జరీనా తదితరులు పాల్గొన్నారు.