టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
– సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఫిబ్రవరి నెలలో తిరుమలలో పీఠాధిపతులు, మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను సదస్సుకు ఆహ్వానిస్తాం.
– శ్రీవారి పోటు కార్మికులకు రూ.10 వేలు వేతనం పెంచాలని నిర్ణయం. అదేవిధంగా ఎంతో కష్టంతో కూడిన విధులు నిర్వహిస్తున్న వాహనబేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనం పెంపునకు నిర్ణయం.
– వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయ అర్చక కైంకర్యాలను పర్యవేక్షిస్తున్న శ్రీ పెద్దజీయర్ మఠానికి రూ.60 లక్షలు, శ్రీ చిన్నజీయర్ మఠానికి రూ.40 లక్షలు ఆర్థిక సహకారం పెంపునకు నిర్ణయం.
– టీటీడీలోని పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. స్కిల్డ్ కార్మికులకు రూ.15 వేల నుండి రూ.18,500/-కు, సెమిస్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుండి రూ.15 వేలకు, అన్స్కిల్డ్ కార్మికులకు రూ.10,340 నుండి రూ.15 వేలకు పెంచడం జరిగింది.
– జిఓనం. 110, తేదీ : 13-03-2023 ప్రకారం కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పీస్రేట్ క్షురకులకు నెలకు రూ.20 వేలు కనీస వేతనం చెల్లించేందుకు ఆమోదం.
– రూ.14.47 కోట్లతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి టెండరు ఖరారుకు ఆమోదం.
– తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం(రెండో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీకోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో జిఎస్టీ కాకుండా రూ.209.65 కోట్లతో శ్రీపథం వసతి సముదాయం నిర్మాణానికి టెండర్లు ఆమోదం.
– తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో పాలనా సౌలభ్యం కోసం రూ.6.15 కోట్లతో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి టెండరు ఆమోదం.
– దూరప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ రూ.7.31 కోట్లతో వంటషెడ్లు, మరుగుదొడ్ల బ్లాక్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు టెండరు ఖరారుకు ఆమోదం.
అదేవిధంగా, అలిపిరిలో రూ.7.24 కోట్లతో నూతన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటుకు టెండరు ఖరారు.
వీటితోపాటు రూ.1.94 కోట్లతో అలిపిరి బస్టాండు, పార్కింగ్ ప్రాంతంలో బిటి రెన్యువల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం.
– తిరుమల హెచ్విసి ప్రాంతంలో మిగిలి ఉన్న కాటేజీల్లో రూ.1.82 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు టెండరు ఆమోదం.
– శ్రీనివాసం విశ్రాంతి సముదాయంలో బస చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీనివాసం తూర్పువైపున రూ.2 కోట్లతో ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి టెండరు ఆమోదం.
– తిరుమలలో యాత్రికుల కాటేజీల్లో నివాసమున్న పోలీసు సిబ్బందిని ఖాళీ చేయించే నిమిత్తం పాత పోలీసు క్వార్టర్ట్స్ను రూ.2.87 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండరు ఖరారుకు ఆమోదం.
– ప్రస్తుతం వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు రూ.6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు టెండర్ల ఆమోదం.
– గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం మరియు శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010వ సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుండి శ్రీనివాసమంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో, పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా దీన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించి బిటి రోడ్డు, వీధిదీపాలు, డ్రెయిన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు రూ.17.29 కోట్లతో టెండరు ఖరారుకు ఆమోదం.
– తిరుపతిలో టీటీడీకి చెందిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలు, ఉద్యోగుల క్వార్టర్స్ ఉన్నాయి. టీటీడీ భవనాలకు సంబంధించి ఎలాంటి ఆస్తిపన్నునూ మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ రోడ్లు, సంస్థలు ఉన్న ప్రాంతాలు, భక్తులు సంచరించే ముఖ్య ప్రాంతాల్లో మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ కోసం టెండర్లను కోర్టు ఉత్తర్వులకు లోబడి కేటాయించాలని నిర్ణయం. కోర్టు తుదితీర్పునకు లోబడి పనులు చేపడతాం.
– ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జార్ఖండ్ రాష్ట్రం దేవ్ ఘర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మించేందుకు ఆమోదం. ఇక్కడ బైద్యనాథ్ బాబా ఆలయం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. 51 శక్తిపీఠాల్లో ఒకటి.
– చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రాకారం, కట్స్టోన్ ఫ్లోరింగ్, స్టోర్ గది, మండపం నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నుండి రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
– తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో సుపథం మార్గం ద్వారా రూ.300/- టికెట్ కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.