పెద్దపవని గురుకుల కళాశాల విద్యార్థినులకు రెండో విడత కౌన్సిలింగ్లో అవకాశం-కలెక్టర్
నెల్లూరు: పెద్దపవని గురుకుల కళాశాల విద్యార్థినులకు రెండో విడత కౌన్సిలింగ్లో అవకాశం కల్పించాలని కలెక్టర్ హరి నారాయణన్ ఉన్నత విద్య మండలి అధికారులను కోరారు..జిల్లాలోని కావలి మండలం పెద్ద పవని గురుకుల కళాశాలకు చెందిన 37 మంది విద్యార్థినులకు ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు చేయడంలో శ్రీకాళహస్తి కి చెందిన ముప్పాళ్ళ రవి తప్పుదోవ పట్టించి ప్రైవేటు కళాశాలలకు దరఖాస్తు చేశాడని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో విద్యార్థులు, కలెక్టర్ కు తమ ఆవేదన తెలియచేశారు. తామంతా మంచిర్యాంకులు సాధించామని తెలిపారు.ఈ విషయమై స్పందించిన కలెక్టర్ ఉన్నత విద్యా మండలి అధికారులతో మాట్లాడారు. రెండవ కౌన్సిలింగ్లో విద్యార్థులకు అవకాశం కల్పించాలని వారిని కోరారు. గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ హేమలతను సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించిన ముప్పాల రవి పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించారు.