పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు-కలెక్టర్
నెల్లూరు: ఆంధ్రరాష్ట్ర ఆవిర్బావానికి కృషిచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిదని, ప్రజల మనస్సుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు..బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తెలుగు భాష,తెలుగు ప్రజల కోసం ఆంధ్రరాష్ట్ర ఆవిర్బావానికి ప్రాణత్యాగం చేసిన గౌరవ అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా వాసులు కావడం మనకెంతో గర్వకారణమన్నారు.. శ్రీ పొట్టి శ్రీరాములు జన్మించిన ఈ జిల్లాలో కలెక్టర్ గా పనిచేయటానికి అవకాశం కలగడం ఎంతో గర్వంగా వుందన్నారు. 1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత, 1950 జనవరిన గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిన తరువాత, ఆ రోజు వున్నటువంటి రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేకంగా రాష్ట్రం వుండాలన్న లక్ష్యంతో, ఆంధ్ర రాష్ట్ర సాధనకు శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించడంతో 1953 సంవత్సరంలో కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడంతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. చరిత్ర అనేది చాలా చాలా ముఖ్యమని, చరిత్రను మర్చిపోరాదని, చరిత్ర ఒక సబ్జెక్ట్ గా చూడకుండదని, చరిత్రలో చాలా విషయాలు వుంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ప్రాణ త్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములును అలాగే స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులందరిని మనమంతా గుర్తు చేసుకొంటూ వారి అడుగుజాడల్లో ముందుకు పోవాల్సిన అవసరం వుందన్నారు.