పరిశ్రమల అవసరాలకు మిగులునీటి సరఫరా చెయుటకు ప్రణాళికలు సిద్ధం చేయండి- కమిషనర్ వికాస్
నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూపు, ఇతర పరిశ్రమల అవసరాలకు నెల్లూరు నగర పాలక సంస్థ నుంచి మిగులు మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. ముత్తుకూరులోని కృష్ణపట్నం పోర్టు అదానీ గ్రూపు, ఇతర ఆయిల్ పరిశ్రమల ప్రతినిధులు, పబ్లిక్ హెల్త్ అధికారులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గనిర్దేశాలను అనుసరించి నగర పాలక సంస్థ పరిధిలో భూగర్భ జలాలకు అనుగుణంగా ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని కమిషనర్ సూచించారు.పరిశ్రమల నిర్వహణకు ప్రతిరోజూ అవసరమైన నీటి సరఫరా అంచనాలను తెలుసుకుని తదనుగుణంగా నగరంనుంచి ముత్తుకూరులోని పరిశ్రమలకు నీటిని అందించేందుకు ప్రణాళికలను రూపొందించాలని కమిషనర్ ఆదేశించారు. పరిశ్రమలలో మౌళిక సదుపాయాల కల్పనతో ఉత్పాదకత పెరగడంతో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహంగా ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధితో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నగరాభివృద్ధి వేగవంతమవుతుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ సంజయ్, డి.ఈలు, పబ్లిక్ హెల్త్ ఈ.ఈలు, డి.ఈలు, ఏ.ఈలు, కృష్ణపట్నం పోర్టు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.