ఈనెల 20వ తేది నుంచి తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు-ఆర్డీవో
నెల్లూరు: పినాకిని నదీ తీరానవెలసి ఉన్న ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా కీర్తించబడే క్షేత్రాదీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు..గురువారం నగరంలోని రంగనాయకులపేటలో వెలసివున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 20వ తేదీ అంకురార్పణ జరుగుతుందని, ఉత్సవాల్లో ముఖ్యంగా 24న హనుమంత వాహనం,, 25న బంగారు గరుడ సేవ,, 26 కల్యాణోత్సవం,, 27 రథోత్సవం,, 31న తెప్పోత్సవాలు జరుగుతాయన్నారు..
జిల్లా నుండే కాక వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు విరివిగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు..బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుండి ముగిసేంత వరకు ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రాథమిక చికిత్స మందులతో పాటు దేవస్థానం వద్ద ఒక అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని ఆర్డిఓ కోరారు.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను ఆర్డిఓ ఆవిష్కరించారు..ఈ సమావేశంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి శ్రీనివాసులరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం అర్చకులు పాల్గొన్నారు.