భక్తుల భద్రతే టీటీడీకీ ముఖ్యం-అన్ని రకాల జాగ్రత్తలు-ఛైర్మన్
నిబంధనలు…
తిరుమల: తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం,,భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న నేపధ్యంలో తిరుపతి పద్మావతి అతిధి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరిస్తూ నడకమార్గంలో రాత్రి 10 గంటలకు వరకు పెద్దవారికి మాత్రమే అనుమతి ఇస్తామని, నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ఊతకర్ర అందచేస్తామన్నారు. ఘాట్ రోడ్ లో వెళ్లే ద్విచక్ర వాహనాలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత నడకదారిలో పిల్లలను అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించామని, నడకదారిలో జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వవద్దని భక్తులకు సూచించారు. ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లైట్లను,,హెచ్చరికల బోర్డులు:- నడకమార్గంలో భక్తులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులను,లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తామని, కేంద్ర అటవీశాఖ అధ్యయనం చేసిన తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు పడేయొద్దని, బయట వ్యర్థాలను వదిలేసే షాపులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కాలినడకన వెళ్లే వారికి గతంలో మాదిరి టికెట్లు మంజూరు చేస్తామని, 15వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు ఇస్తున్నామని, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలన్నారు. ఇకపై భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదని చెప్పారు.
500 కెమెరాలు:- భద్రత కోసం డ్రోన్లను సైతం వినియోగించాలని నిర్ణయించామని,,తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతామన్నారు. నెలన్నర క్రితం నడక దారిలో కౌశిక్ అనే బాలుడిపై చిరుత దాడి చేసిన సంఘటన కానీ,నెల్లూరుకు చెందిన లక్షితపై చిరుత దాడి చేసిన చంపివేయడంపై భాధాకరమన్నారు..అలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడడం జరుగుతుందన్నారు.