అల్పపీడన ప్రభావంతో 3 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు

అమరావతి: నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, అల్పపీడనం కారణంగా పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని పేర్కొంది. ఈ అల్పపీడనం బలపడి తమిళనాడులోని పుదుచ్చేరి, కారైక్కాల్ వైపు పయనించే ఆవకాశం వున్నదని, ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రం మీదకు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా, తిరుపతి సహా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.