స్వర్ణరథంపై ఊరేగిన కోనేటిరాయుడు
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు,అధికారులు పాల్గొన్నారు.