ప్రధాన డ్రైను కాలువల్లో పూడికతీత పనులను చేపట్టండి-కమిషనర్ వికాస్
నెల్లూరు: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన డ్రైను కాలువల్లో వ్యర్ధాలు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న డ్రైను కాలువలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన మురుగుకాలువల్లో పారుదల ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సాంకేతిక యంత్రాల సహాయంతో ముందస్తు జాగ్రత్తలను ప్రణాళికా బద్దంగా చేపట్టాలని, ప్రతీ 15 రోజులకు ఒకసారి పురోగతి నీవేదికలను ఫోటోలు, వీడియోల రూపంలో అందజేయాలని ఆదేశించారు.అదేవిధంగా నగరంలోని బోడిగాడి తోట, దొంతాలి డంపింగ్ యార్డులలో చెత్త పేరుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వర్షాకాలం సమయానికి ఆయా యార్డులను డంపింగ్ ఫ్రీ గా తీర్చిదిద్దాలని కమిషనర్ సూచించారు. డంపింగ్ యార్డులలో రీ సైక్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, సేంద్రీయ ఎరువుల తయారీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ లు సంజయ్, చంద్రయ్య, శేషగిరిరావు, డి.ఈ లు, ఏ.ఈ లు పాల్గొన్నారు.