ఆ దైవం కల్పించిన మహా భాగ్యం-గవర్నర్ అబ్దుల్ నజీర్
కడప: మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని,ఇది ఆ దైవం కల్పించిన మహా భాగ్యం అని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్… ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని దర్శించిన అనంతరం సాయంత్రం కడప పెద్ద దర్గాను సందర్శించారు. పెద్దదర్గాకు చేరుకున్నరాష్ట్ర గవర్నర్.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కడప నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు లతో కలిసి ప్రభుత్వ లాంఛనాలతో దర్గాలో పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.అంతకు ముందుగా దర్గా ప్రతినిధులు రాష్ట్ర గవర్నరుకు, అతిథులకు లాంఛనాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్గా విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.