కాపు భవన్ ఈనెల 16న ప్రారంభోత్సవం-కలెక్టర్
నెల్లూరు: నగరంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో నిర్మించిన కాపు భవన్ ను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఈనెల 16న కాపు భవన్ ను ప్రారంభించనుండగా, ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే భవనం లోపల ఏసీలు, జనరేటర్ ఏర్పాటు చేయాలని, భవన ప్రాంగణంలో చదును చేసి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కాపు సంఘ నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు. కాపు భవన్ కు కేటాయించిన మిగిలిన స్థలం ఆక్రమణకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ సంపత్ కుమార్, ఈఈ గిరిధర్, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, 41 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, బలిజ సంఘ నాయకులు ఉన్నారు.