నైతిక విలువలతో ఓటుహక్కును వినియోగించుకోవాలి-కలెక్టర్ హరినారాయణన్
దేశ భవిష్యత్ ను మార్చే శక్తి ఒక్క ఓటుకే ఉంది..
నెల్లూరు: భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన అత్యంత విలువైన ఓటుహక్కును నైతిక విలువలతో ప్రతిఒక్కరూ వినియోగించుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరినారాయణన్ పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కనప్రాంగణంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ 1949 నవంబరు 26న మన రాజ్యాంగం ఆమోదం పొందిన తరువాత 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భావమైందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సుమారు 96 కోట్ల ఓటర్లు ఉన్న మన దేశంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరి గర్వకారణంగా భావించాలన్నారు. ‘‘ఈ దేశం మనకు ఏమి ఇచ్చిందని కాకుండా, దేశానికి మనం ఏమి ఇచ్చాం’’ అనే ప్రముఖ రాజకీయవేత్త జోసఫ్ కెనడి పిలుపును అందరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. మన దేశం భావిభారత తరాలకు కూడా ప్రజాస్వామ్య విలువలను అందించేలా, అత్యంత శక్తివంతమైన దేశంగా తయారయ్యేలా యువతీ యువకులు తమ ఓటుహక్కును నైతిక విలువతో ఉపయోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
తొలిసారి ఓటుహక్కు పొందిన విద్యార్థుల ఉపన్యాసాలు అందరిని ఆకట్టుకున్నారు. ఓటుహక్కును అమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్లేనని, బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఓటుహక్కు వినియోగించాలన్న గొప్ప సందేశంతో విద్యార్థులు తమ ఉపన్యాసాల్లో వివరించారు. ఓటు గొప్పతనాన్ని వివరించిన కృష్ణచైతన్య కళాశాలకు చెందిన లక్ష్మీ నరసింహ, వర్ష, సాదిక్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.తొలుత గాంధీబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.