DISTRICTS

డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించాలి-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రజలంతా సహకరించాలని, ఆసుపత్రులు, వ్యాపార వాణిజ్య కార్యాలయాల నిర్వాహకులు బహిరంగంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. స్థానిక 44, 46 వ డివిజనులు పొగతోట, గాంధీ బొమ్మ, ఆర్.ఆర్ స్ట్రీట్, ట్రంక్ రోడ్డు, పెద్ద బజారు ప్రాంతాల్లోని శానిటేషన్ మస్టర్ పాయింట్ ను కమిషనర్ శనివారం ఉదయం 6 గంటలకు తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును కమిషనర్ పరిశీలించారు. పొగతోట ప్రాంతంలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల నిర్వాహకులు పరిసరాల పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేషన్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలు అందించాలని సూచించారు. సమీపంలోని ఒక హోటల్ నిర్వాహకులు వ్యర్ధాలను రోడ్డుపై వేయడాన్ని గుర్తించిన కమిషనర్, పద్ధతి మార్చుకోకపోతే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.

అనంతరం స్థానిక పెద్ద బజారు ప్రాంతంలోని మాంసం మార్కెట్టును కమిషనర్ తనిఖీ చేశారు. జంతు వధ కేంద్రంలో అత్యంత పరిశుభ్రతను పాటించాలని, వ్యర్ధాలు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ సూచించిన అన్ని ప్రమాణాలను జంతు వధ కేంద్రంలో పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, విధినిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *